జనాభాను మించిపోనున్న మొబైల్ ఫోన్లు!
ప్రపంచమంతటా మొబైల్ ఫోన్ల విప్లవం నడుస్తోంది. ఎవరి వద్ద చూసినా మొబైల్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది చివరికల్లా ప్రపంచ జనాభా కంటే మొబైల్ ఫోన్ల సంఖ్యే అధికం కానుంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ ఏజెన్సీ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంటర్నేషనల్ టెలికామ్స్ యూనియన్(ఐటీయూ) లెక్కల ప్రకారం.. సెల్ఫోన్ వినియోగదారుల సంఖ్య 2014లో 700 కోట్లను దాటిపోనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 680 కోట్ల మొబైల్ సబ్స్క్రిప్షన్లు ఉండగా.. జనాభా 710 కోట్లుగా ఉంది. మరోవైపు ఆన్లైన్ వినియోగం కూడా బాగా పెరిగిపోయినట్టు నివేదిక వెల్లడించింది. 270 కోట్ల మంది ప్రజలు అంటే.. ప్రపంచ జనాభాలో 40 శాతం మంది ఆన్లైన్ సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపింది.