వ్యవసాయానికి ధన సాయం. ఇందుకోసం చాలా రాష్ట్రాల్లో పథకాలు అమల్లోకి వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఆమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా మాత్రం పూర్తిగా భిన్నమైంది. నిజంగా సహాయం అవసరమైన అర్హులకు మాత్రమే వర్తింప చేయడం. ప్రజాధనం వృథా కాకుండా చూడటం. బడుగు బలహీన వర్గాల కౌలు రైతులకు కూడా సాయం అందించడం. ఇవీ ఈ రైతు భరోసా ముఖ్యాంశాలు. పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్న జగన్, నేనున్నాను అంటూ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. నవరత్నాలే ఎజెండాగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. జగన్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, ఆయనకు అత్యంత ఇష్టమైన రైతు భరోసా పథకంపై ఓ లుక్కేద్దాం.
తండ్రి తలపెట్టిన పథకాలను పక్కాగా అమలు చెయ్యడం. కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులో తేవడం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రథాన్ని కదం తొక్కించే తీరు, దేశంలోనే అపూర్వం. అనితర సాధ్యం అనిపిస్తుంది. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఊహించని సంక్షేమ శకం నడిచింది. దేశంలో ఎవరూ ఊహించనన్ని సంక్షేమ పథకాలతో ప్రజలకు జీవితమే ఒక పండగ, రైతులకు వ్యవసాయం పండగ, విద్యార్థులకు పెద్ద చదువుల పండగ.