ముషార్రఫ్పై బూటు దాడి
నాలుగేళ్ల ప్రవాసం అనంతరం ఇటీవలే స్వదేశానికి చేరుకున్న పాకిస్థాన్ మాజీ నియంత పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్కు ఓ న్యాయవాది చేతిలో చేదు అనుభవం ఎదురైంది. తనపై దాఖలైన పలు కేసుల విచారణ సందర్భంగా శుక్రవారం సింధ్ ప్రావిన్స్ హైకోర్టుకు హాజరైన ముషార్రఫ్పై న్యాయవాది తాజమ్మూల్ లోఢీ బూటు విసిరారు. ముషార్రఫ్ కోర్టు ఎదుట హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బూటు ముషారఫ్కు తగలలేదు. గాల్లో ఎగురుతూ వచ్చి ఆయన ఎదురుగా కొద్ది అడుగుల దూరంలో పడింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ముషార్రఫ్ను అక్కడి నుంచి తరలించారు.
అనంతరం పాకిస్థాన్ రేంజర్లు లోఢీని అదుపులోకి తీసుకుని విచారించారు. దేశంలో ప్రజాస్వామ్య విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్న ముషార్రఫ్ అంటే తనకు అసహ్యమని మీడియా చానళ్లతో లోఢీ పేర్కొన్నాడు. లాల్మసీదులో సైనిక చర్యకు ఆదేశించిన ముషార్రఫ్ను తన తల్లి కూడా ద్వేషిస్తోందని చెప్పారు. ముషార్రఫ్పై బూటు విసరటం ద్వారా తన తల్లికి కొంతైనా సంతృప్తి కలిగించినందుకు సంతోషిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన జరగటంతో సింధ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముషీర్ ఆలం దీనిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. అంతకుముందు వీఐపీ ప్రవేశ ద్వారం గుండా ముషార్రఫ్ కోర్టు లోపలకు వచ్చారు. ఆయన రాక వార్త తెలియగానే పలువురు న్యాయవాదులు ముషార్రఫ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చీఫ్ జస్టిస్ చాంబర్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది.
గతంలోనూ ముషార్రఫ్పై బూట్లు
ముషార్రఫ్పై బూట్లు పడటం ఇదే తొలిసారి కాదు. 2001లో బ్రిటన్లో జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై బూటు విసిరాడు.
అనుమతి లేకుండా పాక్ను వీడొద్దు
మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసు సహా పలు కేసుల్లో ముషార్రఫ్కు ప్రసాదించిన ముందస్తు బెయిల్ను సింధ్ హైకోర్టు మరో 15 రోజులు పొడిగించింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనేందుకు స్వదేశానికి చేరుకున్న పర్వేజ్ ముషార్రఫ్ తమ అనుమతి లేనిదే పాకిస్థాన్ను విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ముషీర్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 22వ తేదీన ఇదే న్యాయమూర్తి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ముషార్రఫ్కు పది రోజులపాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లిన సమయంలో ముషార్రఫ్పై ఎలాంటి కేసులు నమోదు కాలేదని శుక్రవారం విచారణ సందర్భంగా ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రవాసంలో ఉండగా ముషార్రఫ్పై పలు కేసులు దాఖలయ్యాయని, పాక్కు రాకుండా అడ్డుకునేందుకు దురుద్దేశంతోనే వీటిని మోపారని ఆరోపించారు. జడ్జీలను అక్రమంగా అరెస్ట్ చేయించటం, వారి హత్యకు కుట్ర పన్నిన కేసుల్లోనూ ముషార్రఫ్ నిందితుడిగా ఉన్నారు. బేనజీర్ భుట్టో హత్యకేసులో విచారణకు ఆయన సహకరించకపోవటంతో తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ముషార్రఫ్ పరారీలో ఉన్నట్లుగా ప్రకటించి అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ముషార్రఫ్ నేతృత్వంలోని ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ మే 11వ తేదీన జరిగే పాక్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.